Sunday, January 25, 2009

మనలో 'మన'మున్నామా? ( Andhra Jyothy 26-1-2009)

చరిత్రలో మాకు జరిగిన జరుగుతున్న రకరకాల మోసాల అనుభవాలున్న కారణంగా ఉమ్మడి రచయిత్రుల వేదిక పట్ల సంశయంతోనే 'మనలో మనం' సభలకు (జనవరి 10, 11 విశాఖపట్నం) వెళ్లడం జరిగింది. ఈ రెండు రోజులు కూడా స్త్రీ సాహిత్యం దళిత-బి.సి-గిరిజన -ముస్లిం స్త్రీలను పట్టించుకోలేదని, కలుపుకోలేదని, వారి సాహిత్యాన్ని కుక్క ముట్టిన కుండలాగానే దూరం బెట్టిందనే అవగాహనతో చర్చ ప్రారంభించాం. 'స్త్రీవాద' సాహిత్యం ప్రధానంగా కోస్తాంధ్ర ఆధిపత్యకులాల నుంచే వచ్చింది. దాని ఉధృతి పెరిగినా తగ్గినా దళిత బి.సి. మైనారిటీ రచయిత్రులకేం తరిగింది ఒరిగిందిలేదు. దళిత, బి.సి, ముస్లిం స్త్రీలకు కులం, శ్రమ, మతం, మగాధిపత్యం అణచివేతలు చుట్టుముట్టివున్నాయి.

కొద్దిమంది ఆధిపత్య కులాల స్త్రీలు జెండర్ ప్రాతిపదికన ఒకే అస్తిత్వం ఏకపక్షంగా ప్రకటించుకోవడం మాకు అభ్యంతరం. స్త్రీలంతా ఒకటి కాదు. కుల, మత, ప్రాంత అస్తిత్వాలతో ఎవరి కులాల్లో, ఎవరి శిబిరాల్లో ఎవరి పొయిలు వారికున్నయి. వారి సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి. స్త్రీలంతా ఒక్కటే అనడం వల్ల స్త్రీలల్లో వున్న అసమానతల్ని వారి అస్తిత్వాల్ని మాట్లాడనివ్వకుండా అవగాహన చేస్కోలేని అప్రకటిత సెన్సార్‌షిప్‌లకు గురిచేసే, గురయ్యే ప్రమాదముంది. తద్వారా స్త్రీ సాహిత్యం అసమగ్రం అవుతుంది. ఈ సభల్లో ప్రధానంగా చర్చ జరిగింది దళిత, బి.సి, ముస్లిం స్త్రీల జీవితాల చుట్టూ ఆవరించిన ఆకాంక్షలకి, అభివృద్ధికి సాహిత్యం చేసిన కృషి, సేవ ఏమీలేదనే! వారి అనుభవాలు, సంఘర్షణలు, శ్రమదోపిడి, కుల దోపిడి, వారెదుర్కొంటున్న మగ వాదం దిశగా చర్చ జరగాలి అనే దాని చుట్టూ సభ స్పందించింది.

దళిత బి.సి. ముస్లిం స్త్రీల అస్తిత్వాలకు సంబంధించిన అధికార రాజకీయాల్ని ఏ మేరకు గుర్తిస్తున్నారు, అవి ఏ మేరకు సాహిత్యంలో భాగమయ్యాయి? రచయిత్రులకు ఉమ్మడి వేదిక కావాలనుకుంటే ముందుగా కోస్తాంధ్ర ఆధిపత్య కులాల స్త్రీల రచనలకు పరిమితమైన 'స్త్రీవాద' పదం, విస్తృతమైన-మెజారిటీగా వున్న-అణగారిన దళిత బి.సి. ముస్లిం గిరిజన స్త్రీల సాహిత్యానికి సరిపోదు, యిమడదు. అందుకే ఆ పదం పట్లనే మాకున్న అభ్యంతరాల్ని సభ ఆమోదించింది. ఇకమీదట దళిత స్త్రీవాదం, ముస్లిం స్త్రీవాదం అని మా సాహిత్యాన్ని సంబోధించొద్దు.

ఆ 'స్త్రీవాదం' అనే పదం లేకుండా దళిత మైనారిటీ బి.సి స్త్రీల విస్తృతి ప్రాతిపదికన ఒక కొత్త పదాన్ని రూపొందించుకోవాలనే మా అభ్యంతరంపై సభ ఆమోదం తెల్పింది. ఒకరిద్దరు ఆధిపత్య కులాల విప్లవ సంఘాల రచయిత్రులు ఈ కులాలు, అస్తిత్వాల కంటే శ్రమ స్త్రీల నుంచి సాహిత్యం రావాలి అన్నారు. ఆ విషయంతో మేము తీవ్రంగా విభేదించి శ్రమ-కులం వేరువేరుగా లేవు. కులమే శ్రమగా వ్యవస్థీకృతమైంది. కులమనేది పుట్టుకతోనే సంఘబానిసల్ని తయారు చేసింది భారతదేశంలో. కులమనేది శ్రమ విభజననే కాదు శ్రామికుల మధ్య విభజనను కూడా సృష్టించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలనే వాదన పెట్టాం. దాని చుట్టూ జరిగిన చర్చలో 'శ్రమ స్త్రీలు' ప్రత్యేకం అనే వాదం వీగిపోయింది.

ఇక వాకపల్లి వెళ్లడాన్ని ఉద్యమ యాత్రగా చెప్పటంపైన మా అభ్యంతరం వాళ్లకు స్వీపింగ్ కామెంట్‌లా కనిపించింది. వాకపల్లి వెళ్లి అరకు చూసిరావడాన్ని ప్రశ్నించడం వారికి మింగుడుపడలేదు. గుజరాత్ వెళ్లేప్పుడు ముస్లిం స్త్రీలు ఎందుకు కనిపించలేదు? అన్న ప్రశ్నకు జవాబులేదు. చుట్టూ ఇంత క్షోభ, ఇంత పోరాటం, ఇంత వస్తువు, ఆత్మహత్యలు, హత్యలు, అవమానాలు ఇన్ని జరుగుతుంటే మీరు మళ్లీ రామాయణ మహా భారతాల్లోకి వెనక్కి వెళ్లి రాయడం వస్తు రాహిత్యమా? బాధ్యతా రాహిత్యమా? అన్న ప్రశ్నకు సమాధానం లేదు.

పక్కనే ఉన్న సిరిసిల్లలో ఇన్ని ఆత్మహత్యలు జరుగుతుంటే ఎందుకు వెళ్లలేదంటే సమాధానం లేదు. దళిత బి.సి. ముస్లిం స్త్రీలు ఇంత విస్తృతంగా రాస్తుంటే, భాష అడ్డమొచ్చిందనో యాస అర్ధం కావట్లేదనో వంకలు పెట్టి వీరి సాహిత్యాన్ని దూరం ఉంచారు సరే, కనీసం అక్షర రూపంలో దాడి జరుగుతుంటే సపోర్టు కూడా ఇవ్వలేదు, ఎందుకు? అన్న ప్రశ్నకూ సమాధానం లేదు. ఇక వీరిలో నవలా రచయిత్రి ఒకరు 'ముద్దు పెట్టుకుంటున్న సమయంలో నేను స్త్రీనో పురుషుణ్ణో మరచిపోతాను... మనం రాసేదంతా కల్పనే కదా' అనడం అస్తిత్వవాదాలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లే కదా!

సాహిత్యమంతా కల్పనే అనే ప్రమాదకర స్టేట్‌మెంట్ ఇచ్చినట్లవుతుంది కదా! కథా రచయిత్రి ఒకరు 'బ్రాహ్మణ ఇళ్లల్లో పనిచేస్తారు, వాళ్లిచ్చినవి తింటారు, మా ఇళ్లల్లో పని చేయరు, మేమిచ్చినవి గోడవతల పడేస్తారు' అని దళితుల గురించి మాట్లాడారు. ఇలాంటి భావజాలాలతో నిండి ఉన్న మనస్సులు, మనుషులతో ఎలా కలిసిపోతాం? నిలువెత్తు గోడలు కట్టుకుని కూర్చుని 'మనలో మనం' అనడం ఎంతవరకు సబబు? అనిపిస్తున్నది.

అగ్రవర్ణ పురుషాధిపత్యాన్ని ప్రశ్నించడం వరకే పరిమితమైన స్త్రీవాద సమూహం, మెజారిటీగా ఉన్న బి.సి, దళిత, మైనారిటీ స్త్రీల సమస్యలపై ఏనాడు స్పందించింది లేదు. వారి సమస్యలపట్ల అంటీముట్టనట్లుగా ఉండటమే కాక దళిత రచయిత్రులు లేవనిత్తిన ప్రశ్నలకు కూడా వీరి వద్ద సమాధానాలు లేవు. కుల వివక్ష గురించి, మత దాడుల గురించి వీళ్లు మాట్లాడింది లేదు.

అదేదో తమకు సంబంధించని విషయంగానే చూస్తూ వస్తున్నారు. ముస్లిం రచయిత్రుల భాషపట్ల వచ్చిన విమర్శ కూడా తెలిసిందే. ముస్లిం స్త్రీలు తమ మతం వల్ల గురయ్యే హింస గురించి రాసినపుడు సపోర్టు చేసినంతగా హిందూత్వవాదుల దాడుల గురించి రాసినదాని పట్ల మౌనంగా ఉండటం గమనించవచ్చు. అలాగే స్త్రీవాదులెప్పుడూ ప్రజాస్వామికోద్యమమైన ప్రత్యేక తెలంగాణకు మద్దతిచ్చింది లేదు. మరో ప్రజాస్వామిక ఉద్యమమైన మాదిగ దండోరా పట్ల కూడా మద్దతు ప్రకటించలేదు. మరి వీరెలా ప్రజాస్వామికవాదులవుతారు? ఉమ్మడి వేదికను చారిత్రక ఘట్టంగా వర్ణిస్తూ, 'మేమే చేశాం' అని చెప్పుకోవడానికే మమ్మల్ని ఆహ్వానించినట్లు కనిపిస్తోంది.

ఎందుకంటే ఇంతకు మునుపు వీళ్లెవరూ అస్తిత్వ వాదాల గురించి మాట్లాడటం, రాయడం చేయలేదు. కదులుతున్న నీలిమేఘాలు ఎవరిని కబళించాలని? ఉరుముతున్న నల్లమబ్బుల మీద వీరికి ప్రేమ లేదు. పైగా మా జాతుల మీద ప్రేమ లేని రచనలూ వీరి పుస్తకాల్లో చూడొచ్చు. ఉన్న గ్యాప్స్‌ని కొత్త ఋతువుల కింద పూడ్చేయాలని చూస్తున్నారా? అస్తిత్వాల గొంతు నొక్కేయాలనుకుంటున్నారా? ఇంకా ఇలాంటి అనేకానేక కారణాల వలన, 'స్త్రీవాదం'తో మేము మమేకం కావడం వల్ల మా అస్తిత్వాల్ని వారు మింగేసే ప్రమాదం ఉండొచ్చని భావిస్తున్నాం.

మా ప్రత్యేక అస్తిత్వాల్ని గుర్తించ నిరాకరించే 'స్త్రీవాదులు' మా వాదాల్ని, వాదనల్ని గౌరవించనపుడు వారితో కలిసి పని చేయడం ప్రశ్నార్థకమవుతుంది. మా భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినవారమే అవుతాం. మా సందేహాలకు, సంశయాలకు స్పష్టమైన సమాధానాలు దొరికితే ఉమ్మడి వేదిక సాధ్యం కావొచ్చేమో! లేకపోతే మా పోరాటం మేము ఎలాగూ చేస్తూనే పోతాం.

- జూపాక సుభద్ర, షాజహానా

Saturday, January 24, 2009

MADIGA RESERVATION PORATA SAMITI
Andhra Pradesh
13-6-462/A/27, Bhagavandasbagh, Tallagadda, Hyd – 500 067. Cell: 99483 11667, krupakarmadiga@gmail.com

Krupakar Madiga P.
State President

New Delhi,
To
20-12-2008
Dr.Manmohan Sing ji,
Prime Minister of India,
New Delhi




Sub: Rationalisation of SC reservation in AP – Introduction of Bill in Parliament – Req. – Reg.

Respected Sir,

Distribution of SC Reservation opportunities to all the 59 castes of SCs proportionately, based on their population, has been the demand and struggle of Madigas (Charmakars) and Rellies (Manual Scavengers) of Andhra Pradesh, for the last 30 years.

Recently, Justice Usha Mehra Commission constituted by the Govt of India, also recommended for rationalization (categorization) of SCs in AP by amending Article 341 of the Constitution.

There is an urgent need for providing equal distribution of reservation benefits to all communities of SCs at least in the forthcoming academic year. To this extent, there is a need for the Parliament to make an Act immediately.

In the light of above, we request you to kindly initiate the process of amending Article 341 of the Constitution in the present winter parliament session.

Thanking you Sir,

Yours sincerely


(P. Krupakar Madiga)

కైతునకల దండెం - మాదిగ కవిత్వం పుస్తకం

madiga krupakar

Friday, January 23, 2009

జూపాక సుభద్ర ఇంటర్వ్యూ... వార్త : 24-1-2009

అవకాశంలో సగభాగం ( జూపాక సుభద్ర తో సూర్య దినపత్రిక 23-1-2009 ఇంటర్వ్యూ)


మంచి అవకాశం వస్తే అప్పటికప్పుడు ఎంతటి బాధ్యతనైనా నిర్వర్తించడానికి తయారవుతున్నారు నేటి మహిళలు. అప్పటి వర కూ ఉద్యోనిగా, రచయితగా ఉన్న సెక్రటేరి యేట్‌ ప్రభుత్వ కార్యదర్శి జూపాక సుభద్రకూ ఇలాంటి ఓ సదవకాశం దక్కింది. ఈనెల 24న జరగనున్న సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్ని కల్లో ఆమె మొదటి మహిళా అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. ప్రఖ్యాత తెలంగాణ వాద రచయితగా ఆమె అందరికీ సుపరిచితమే. ఉద్యోగుల, మహిళా సంక్షేమమే తన ధ్యేయమంటోన్న సుభద్రతో ధీర ఇంటర్వ్యూ...
..............

మీకీ అవకాశం ఎలా వచ్చింది?


రచనల ద్వారా నా అంతరంగ భావాలను గుర్తించిన ఉద్యోగులు నన్ను బరిలో దిగటానికి ప్రోత్సహించారు. నాదంతా తెలంగాణా దళిత నేపథ్యం. నేను స్వాతంత్ర సమరయోధుల కుటుంబం నుంచి వచ్చాను. పాఠశాల నుంచి విశ్వవిద్యాలయం దాకా అన్ని విద్యార్థి నాయకత్వ కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఎం.ఫిల్‌ చేస్తుండగా సచివాలయ, సర్వీసులో సహాయ విభాగ అధికారిగా 1988లో చేరాను. ప్రస్తుతం సహాయ కార్యదర్శిగా గృహనిర్మాణ శాఖలో విధులు నిర్వహిస్తున్నాను.

సచివాలయంలో మార్పులు తీసుకురావడానికి మీరు ఎలాంటి పాత్ర నిర్వర్తించారు?


సచివాలయంలో దాదాపు 3,600 మంది ఓటర్లు ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల సంఘంలో మహిళలకు ప్రాతినిధ్యం లేని పరిస్థితులుండేవి. 1991లో అదనపు కార్యదర్శిగా పోటీ చేసి గెలిచిన మొదటి మహిళగా గుర్తింపు సాధించాను. అదే సంవత్సరం మహిళా ఉద్యోగుల కోసం సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం స్థాపించాను. దీని ద్వారా మహిళల్లో నాయకత్వ లక్షణాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రసూతి సెలవులను నాలుగు నెలలకు పొడగించడం, ఉద్యోగిణులకు ప్రత్యేక బస్సు సౌకర్యం, వంట గ్యాస్‌ ఉదయం పది గంటలకు ముందు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఉద్యోగులకు సరఫరా చేసే విధంగా జీవోలు సాధించుకున్నాం. వీటన్నింటికి బాధ్యత నేనే వహించాను.

ఉద్యోగిణులు ఉన్నత నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారని మీరు భావిస్తున్నారా?


స్త్రీకి నాయకత్వం వహించే సంపూర్ణ స్వేచ్ఛ ఇంకా లభించలేదు. కుటుంబ చట్రం, ఆర్థిక, సామాజిక, జెండర్‌ అణిచివేతలు ఇవన్నీ మహిళకు నిరంతర సవాళ్లుగా ఎదురవుతున్నాయి. అందుకే మహిళ ఉన్నత నాయకత్వాన్ని అందుకోలేకపోతుంది.

మరి నాయకత్వ స్థానాల్లో ఎదగటానికి అధిగమించవల్సిన అంశాలేమిటి?


న్యూన్యతని వదులుకోవాలి. ఆత్మ విశ్వాసాన్ని, చొరవని ప్రదర్శించాలి. ప్రోత్సాహాన్నందించే సామాజిక, కుటుంబ వాతావరణం కూడా పెరగాలి.

అధ్యక్ష్యురాలిగా గెలిస్తే?


ముందుగా ఖాలీ ఉద్యోగాలని భర్తీ చేస్తాను. పని భారానికి సరిపోయే కొత్త పోస్టులకోసం, ప్రమోషన్‌‌స, అవకాశాలు, స్పోర్‌‌ట, కల్చరల్‌ గ్రాంట్‌‌స పెంపు కోసం కృషి చేస్తాను. స్థలాలు, ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగులందరికీ బాధ్యతాయుతమైన న్యాయమందిచడం కోసం కృషి చేస్తాను. వైద్య సదుపాయాల కోసం నిధుల పెంపు, క్యాంటీన్‌ ధరల తగ్గింపు.... ఇతరత్రా కార్యక్రమా లను పారదర్శకతతో నిర్వర్తిస్తాను.

ఉద్యోగిణులకు మీరిచ్చే విజన్‌ ఏమిటి?


నాయకత్వ స్థానాల్లో అన్నిచోట్ల పురుషులతో సమానంగా ఎదగాలి. అన్ని రకాల అవకాశాల్లో సగం వాటా మహిళలు పొందాలి. వివక్షకు తావులేని సమాజం కోసం మహిళా నాయకత్వాన్ని వారి సాధికార శక్తిని నిరంతరం పెంచుకోవాలి.

( సూర్య 23-1-2009 సౌజన్యంతో)